మేం కలిసే పోటీచేస్తాం

అక్టోబర్ 1న మళ్లీ సమావేశం

సీట్లపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం
సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశం నిర్ణయం
పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్న కేసీఆర్ : తమ్మినేని
కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకోవడం లేదు : కూనంనేని
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 21 (జనంసాక్షి)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే ఏయే సీట్లలో పోటీ చేయాలనే దానిపై చర్చించామన్నారు. అవి ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు. వచ్చేనెల ఒకటిన మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే సీట్లపై చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో గురువారం సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జావ్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గన్నారు. అనంతరం మీడియాతో తమ్మినేని, కూనంనేని మాట్లాడారు.
మహిళా విల్లును వెంటనే అమలు చేయాలి : తమ్మినేని
తమ్మినేని వీరభద్రం మాట్లాడుకూ మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడమంటే ఎన్నికల్లో లబ్దికోసమే మహిళా బిల్లును తెచ్చినట్టుగా ఉందన్నారు. మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం మూడో ఫ్రంట్ ఆలోచన అంతా బీజేపీ కోసమేనని విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లో ఎంఐఎం కావాలనే పోటీ చేసి ఓట్లను చీల్చిందన్నారు. బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్ ఆలోచన ఉందని చెప్పారు. గతంలో కేసీఆర్ వారందరూ ఇండియా కూటమిలో ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఆయన మాత్రం ఇండియా లేదా ఎన్డీఏ కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కోసమే పనిచేస్తామని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఐక్యంగా ఉండాలని అన్నారు. సీసీఐ, సీపీఐ(ఎం) ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయనీ, ప్రజా సమస్యలపైనా పోరాటం చేస్తాయని వివరించారు. కాంగ్రెస్తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని
కాంగ్రెస్ తో పొత్తు అంశం చర్చకు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. అయితే ఆ పార్టీతో తాము పొత్తు వద్దనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీట్లు ఇస్తుందంటూ ఊహాగానాలు వద్దనీ, కలిసి మాట్లాడినప్పుడు చర్చ వస్తుందన్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేస్తాయనీ, సీట్ల విషయంలో వచ్చేనెల ఒకటిన మరోసారి చర్చించి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అంగనవాడీ కార్మికులపై పోలీసులు దాడి చేయడం సరైంది కాదన్నారు. సమ్మె చేస్తే కొడతారా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఉద్యోగంలోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంతో కేసీఆర్కు నుంచి సఖ్యత ఉందన్నారు. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో ఎంఐఎం నేతలు, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. థర్డ్ ఫ్రంట్ పెట్టాలంటూ కేసీఆర్ ఆ పార్టీని అడుగుతున్నారని చెప్పారు. అందరి మీద దాడులు చేసే బీజేపీ ప్రభుత్వం ఎంఐఎం మీద ఒక్క కేసు ఎందుకు పెట్టడంతో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ అరితేరిందని విమర్శించారు. జనాలను మభ్యపెట్టడానికే మహిళా బిల్లును తెచ్చిందన్నారు. రాష్ట్రపతి విధవ కావడం వల్లే కొత్త పార్లమెంటు ఆమెతో ప్రారంభించలేదని చెప్పారు. రాజ్యాంగ పీఠిక గుండెకాయలాంటిదని అన్నారు. అందులో నుంచి సామ్యవాదం. లౌకికవాదం పదాలను ఎలా తొలగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయు ప్రశ్నించారు. హిందూరాజ్యంగా చేయడం కోసమే బీజేపీ ఇలాంటివి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో ఓటమిపాలవుతుందన్నారు.