యూత్‌కి సత్య నాదెళ్ల సలహా ఇదే!

41464601651_625x300భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. ‘టెక్‌ ఫఱ్‌, ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ (మంచి కోసం సాంకేతికత, భారత్‌ కోసం ఆలోచనలు) అంశంపై ఆయన ప్రసంగిస్తూ మొదట గాలీబ్‌ సూక్తిని ఉటంకించారు. ప్రపంచానికి నిరంతరం స్ఫూర్తినిచ్చే సామర్థ్యం భారత్‌కు  ఉందని ఆయన కొనియాడారు. యువ ఔత్సాహికులకు మీరు ఇచ్చే సలహా ఏమిటని అడుగ్గా.. ‘ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో అవ్వడం లాంటి ఉన్నతమైన కలల సాకారానికి కృషి చేయండి’ అంటూ నాదెళ్ల సూచించారు. ‘భారత ప్రజల మేధోకుశలతను పెంపొందించే వేదికను అందించేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కంటిచూపులేని వారికి, తక్కువగా ఉన్నవారికి ఉపయోగపడేవిధంగా తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్‌ లెవెల్ స్మార్ట్‌గ్లాసెస్‌ వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీనిని మైక్రోసాఫ్ట్‌కు చెందిన హోలోలెన్స్‌ కంపెనీ రూపొందించింది.

ప్రధానమంత్రి మోదీతో భేటీ!
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల మూడోసారి భారత పర్యటనకు వచ్చారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రారంభమై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అలాగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులను కూడా ఆయన కలువనున్నారు.