రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి

కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కర్నూలులో అయన మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.రఘువీరారెడ్డి పాదయాత్రపై అయన ధ్వజమెత్తారు. ఓట్లు,సీట్ల కోసమే రఘువీరారెడ్డి పాధయాత్రలో మంత్రులు పాల్గోంటున్నారని అన్నారు.తుంగభద్రసీటి చౌర్యంపై వీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి నీటి వాటాను సాదించుకునేందుకు అందరం కలిసిపోరాడదామనీ. ఇందుకు అవసరమైతే తాను పట్టుడుకర్రలు సరఫరా చేస్తాననీ అన్నారు. హంద్రీనీవా కాలువతో కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు కేవలం రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లినంత మాత్రాన సీమంతా సస్యశ్యామలం అయినట్టేనా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మరో 45 టీఎంసీల కృష్ణా మిగులు జలాలపైన రాయలసీమ ప్రాంతానికి కేటాయించేందుకు పోరాడాలన్నారు.అనంతపురం జిల్లాకు మరో సాగు ప్రాజెక్టుకు అవసరమని ప్రతిపాదనలు పంపాలని బ్రజేష్‌ మిశ్రా కమిటీ మూడుసార్లు కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ హక్కుల కోసం ఉద్యమం సాగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అయన దీక్ష కూడా చేపట్టారు.