రాఘవాపురానికి సీఎం వరాలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాఘవాపురానికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. రాఘవాపురంలో పర్యటించిన ఆయన.. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో పాటు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.14 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.కోటి 22 లక్షల విలువైన ట్రాక్టర్లు, ఎక్సైజ్, ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు సీఎం. రాఘవాపురానికి తన నిధుల నుంచి కోటి రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కోటి రూపాయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. రాఘవాపురానికి ఇప్పటికే 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశాం.. మళ్లీ మరో 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్న సీఎం.. ఎర్రవల్లిలాగే రాఘవాపురంలోని కుటుంబాలందరికీ పాడి పశువులను కొనిస్తామని పేర్కొన్నారు. మీరు కోరుకున్న పాడి పశువులను మీ కలెక్టర్ కొనిస్తారని తెలిపారు. గంగదేవిపల్లి మార్గంలో ఐకమత్యంగా పయనించడం శుభపరిణామమని చెప్పారు. గంగదేవిపల్లిని మించిన గ్రామంగా రాఘవాపురంగా అభివృద్ధి చెందాలన్నారు. గ్రామస్తులంతా ఒకే మాటమీద నిలబడి అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.