రాజధాని పేరుతో బాబు భూమాయ

సిఎం జగన్‌కు అన్నీ తెలుసు అన్న నేతలు

ఏలూరు,నవంబర్‌27 (జనంసాక్షి )  : రాజధాని మాటున బాబు బినావిూలు భారీగా భూములు కొనుగోలు చేశారని వైకాపా నేతలు అన్నారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ భూకుంభకోణం చేసిందని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తదితరులు విమర్శించారు. తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎక్కువ కవిూషన్లు తీసుకోవచ్చని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని, అలాంటి అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరేడ్‌ చేస్తారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్‌లు కట్టారని, ఒకటి హైకోర్టు, తాత్కాలిక సచివాలయమన్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు కారుతుందని, పెంకులు లేచిపోతున్నాయన్నారు. చంద్రబాబు రాజధానిని సర్వనాశనం చేశారని,భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమంతా కూడా కుట్రలు, మోసాలే అన్నారు. చంద్రబాబు అమరావతిలో పరేడ్‌ చేసేందుకు అనర్హులు అన్నారు. ఇష్టానుసారంగా పాలన చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు. రాజధాని ఎలా నిర్మించాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలుసని అన్నారు. వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు మాని, ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలని సూచించారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటల మాంత్రికుడని, మాటలతోనే ప్రజలను భ్రమల్లోకి నెట్టారన్నారు. ఆయన అమరావతిలో చేసింది ఏవిూ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కచ్చితంగా చేపడుతుందని, అయితే చంద్రబాబు మాదిరిగా వేల కోట్లు వృథా చేయమని స్పష్టం చేశారు.