రాజ్యసభలో అదే గందరగోళం

12మంది ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండ్‌
సంజయ్‌ సింగ్‌ను బయటకు పంపేయండి..
మార్షల్స్‌ను ఆదేశించిన చైర్మెన్‌ వెంకయ్య
రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ
న్యూఢల్లీి,డిసెంబర్‌14(జనంసాక్షి ): రాజ్యసభలో ఇవాళ కూడా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. రాజ్యసభలో విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే పన్నెండు మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొన్నది. విపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా నినాదాలు మారుమోగాయి. దాంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్‌ సీన్‌ రిపీట్‌ కావడంతో ఛైర్మన్‌ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో సభ్యత, మర్యాదలకు భంగం కలుగునివ్వకూడదని కోరారు. అన్యాయం, అమర్యాద అన్నివేళలా పనిచేయవని ఆయన హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.వెల్‌లో కూర్చుని నినాదాలు చేశారు. సభ జరుగుతుండగా నినాదాలతో అడ్డుకున్నారు. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ విపక్ష సభ్యులు సభలో ఆందోళన సృష్టించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైర్మెన్‌ వెంకయ్య తెలిపినా.. కొందరు విపక్ష సభ్యలు వెల్‌ను వీడలేదు. దీంతో చైర్మెన్‌ వెంకయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. అయినా విపక్ష సభ్యలు వినలేదు. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్‌ సింగ్‌ గట్టి అరిచారు. చైర్‌నే సవాల్‌ చేస్తున్నారని సంజయ్‌పై చైర్మెన్‌ సీరియస్‌ అయ్యారు. ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సభ నుంచి బయటకు పంపించాలని చైర్మెన్‌ వెంకయ్య అక్కడ ఉన్న మార్షల్స్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేశారు. 12 మందిపై వేటును ఎత్తివేయాలని పార్లమెంట్‌ భవనం నుంచి విజయ్‌చౌక్‌ వరకు విపక్ష సభ్యులు ర్యాలీ తీశారు.