రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై అన్ని పార్టీలు ఐక్యపోరాటాలు చేయూలని సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీజేపీ జిల్లా శాఖలు కోరారు.

విద్యుత్‌ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనలు చేపట్టారు. కరెంటు ఛార్జీలు తగ్గించకుంటే కాంగ్రెస్‌ కాలగర్భంలో కలపక తప్పదని హెచ్చరించాయి. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట వేర్వేరుగా రెండు శిబిరాల్లో జరిగిన నిరసన దీక్షలకు సిద్ధాంత విభేదాలు మరిచి నాయకులు సంఘీభావం

తెలుపుకున్నారు.

అసమర్థ ప్రభుత్వం గద్దెదిగే వరకూ ఉద్యమం

అసమరథ కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగే వరకూ ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్‌ చార్జీల మోతలు, కరెంటు కోతలకు నిరసన పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను ప్రారంభించిన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఏక పక్ష నిర్ణయాలతో సీఎం కిరణ్‌కుమారెడ్డి ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. చేతగాని ప్రభుత్వం పాలించే హక్కు కోల్పోయిందని పేర్కొన్నారు. కరెంట్‌ మంటల్లో ప్రభుత్వం కాలిపోక తప్పదన్నారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ, సీపీఐఎంఎల్‌, ఫార్వర్‌బ్లాక్‌, ఎంసీపీఐయూ నాయకులు కొయ్యడ సృజన్‌, భాగ్యలక్ష్మీ , న్యాలపట్ల రాజు, సంపత్‌, ఎడ్లరమేశ్‌, రాజు,శ్రీనివాస్‌ , మీసం లక్ష్మణ్‌ , సొన్నారి రామయ్య రయేష్‌, కిషన్‌ , రామన్న , తేజ్‌దీప్‌రెడ్డి , గవ్వ వంశీధర్‌రెడ్డి, బద్ధం అజయ్‌, అజీమొద్దీన్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

పేదల నడ్డివిరుస్తున్న సర్కార్‌

విద్యుత్‌ చార్జీలను పెంచిన సర్కార్‌ పేదల నడ్డి విరుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అన్నారు. విద్యుత్‌ సంక్షోభానికి నిరసనగా కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు టీజేఏసీ జిల్లా చైర్మన్‌ వెంకటమల్లయ్య , వామపక్ష నాయకులు చాడ వెంకటరెడ్డి, ముకుందరెడ్డి,  శ్రీనివాస్‌, కిషన్‌ సంఘీభావం తెలిపారు. పార్టీలకతీతంగా ఐక్యఉద్యమం కొనసాగించాలని కోరారు. దీక్షలో బీజేపీ నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, శశిభూషణ్‌ కాచే, శ్రీధర్‌, వర్డినేని సత్యనారాయణరావు, మట్టవెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం నాగరాజు, లక్కిరెడ్డి తిరుమల కూర్చున్నారు. వీరికి బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి కె. ఓదెలు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు బాసవేని మల్లేశం మద్దతు తెలిపారు.