రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి 

` సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి
` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ..
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.. పదేళ్లుగా ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్‌ మోడ్‌లో పూర్తవుతోందన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌ తో పాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయని లేఖలో వివరించారు.ఇందులో భాగంగానే.. నగరంలో ఉన్న సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్‌ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందన్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి రైల్వే టర్మినల్‌ కేంద్రం కానుందన్నారు.దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ రైల్వే స్టేషన్‌ను అంకితం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. అయితే రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయని గుర్తు చేశారు. రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌, ఆల్ఫా హోటల్‌ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా.. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో చొరవచూపాలని ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఈ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.