రిజర్వేషన్లు కొనసాగుతాయి

5

– ఆందోళన వద్దు

– ప్రధాని మోదీ భరోసా

న్యూఢిల్లీ,మార్చి21(జనంసాక్షి): రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, విపక్షాలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వెనుకడిన దళిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. సోమవారం ఢిల్లీలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మారకానికి శంకుస్థాపన చేసిన ఆయన స్మారకోపన్యాసం చేశారు. బాబా సాహెబ్‌ను దళిత జనోద్ధరణకు పాటుపడిన నేతగా మాత్రమే చూడకూడదని, సంపన్నవర్గాల సంక్షేమానికి కూడా అంబేద్కర్‌ పని చేశారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్‌ను ఆయన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌తో పోల్చారు. అయితే గతంలో అంబేడ్కర్‌ను తక్కువ చేసి చూశారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో దళితులు, గిరిజనులకు న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తామని, అప్పుడు లోటు పాట్లు కూడా దూరమైపోతాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంబేద్కర్‌ పేరులోనే, ఆయన చర్యల్లోనే సమర్థత ఉందని కొనియాడారు. ఆయన ఆలోచనా విధానం అమోఘమని, అంబేద్కర్‌ వారసత్వమే మనకు అదృష్టమని ఆయన అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే మన కర్తవ్యమని మోదీ అన్నారు. బాబా సాహెబ్‌ మానవత్వానికి ప్రతీక అని, అమానవీయ శక్తులను అంబేద్కర్‌ తిరస్కరించేవారని, ప్రతీ అంశాన్ని రాజ్యాంగపరంగా ఆలోచించేవారని మోదీ కొనియాడారు.

మన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అంబేడ్కర్‌’

ప్రజలందరూ విద్యావంతులు కావాలని బీఆర్‌ అంబేడ్కర్‌ కోరుకున్నారన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.బాబాసాహెబ్‌ కలలను సాకారం చేసే అదృష్టం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరణించిన 60 ఏళ్ల తరువాత మెమోరియల్‌ ఏర్పాటు కావడం పట్ల మోదీ విచారం వ్యక్త చేశారు. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కు అయిన రిజర్వేషన్లను ఎవరూ కొల్లగొట్టలేరని పేర్కొన్నారు. అది వారి హక్కు అని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ ను  అమెరికా  నల్లజాతి  పోరాట యోధుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తో పోల్చారు. వారిద్దరూ ప్రతి అమానవీయ ఘటనల పట్ల గొంతెత్తిన మహాపురుషులని కొనియాడారు. అంబేడ్కర్‌ విశ్వమానవుడని, భారత్‌కు మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉండవనే అపోహలు చెలరేగాయని.. కానీ  తమ ప్రభుత్వ హయాంలోని దేశంలో ఎక్కడా అలా జరగలేదన్నారు. అణగారిన వర్గాల బలమైన గొంతుక అంబేడ్కర్‌ అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే.. ఈ రోజు తాము చేపట్టిన కార్యక్రమాలను 60 ఏళ్ల క్రితమే ఆయన చేపట్టి ఉండేవారన్నారు. సుమారు 18,000 గ్రామాల్లో విద్యుత్‌ అందించడం ద్వారా అంబేద్కర్‌ కలలను సాకారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే తాను మంత్రివర్గంలో కొనసాగనని అంబేడ్కర్‌ చెప్పారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో జల మార్గాలకు సంబంధించిన బిల్లు ఉందని, అయితే భారత్‌కు ఉన్న శక్తివంతమైన సముద్ర మార్గాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది అంబేద్కరేనని తెలిపారు. అంబేడ్కర్‌ ఫిలాసఫీలో భాగమైన రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అగ్రిఉత్పత్తుల మార్కెట్‌ రేట్లు గురించి నవీకరించబడిన సమాచారాన్ని రైతులు పొందడానికి వీలుగా ఏప్రిల్‌ 14న కొత్త టెక్నాలజీని  ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు.