రూ.400 కోట్లతో.. వేములవాడ ఆలయ అభివృద్ధి
– దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్5 (జనం సాక్షి ) : తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాళేశ్వరం జలాలను మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడి చెరువులోకి గురువారం ఉదయం వదిలారు. పంప్ హౌజ్ వద్ద మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అంతరం గుడి చెరువు వద్ద పూజలు చేసి గంగమ్మకు హారతినిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రూ.400 కోట్లతో వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. గుడి చెరువులోకి కాళేశ్వరం జలాలను తరలించడంతో పాటు మిని ట్యాంక్ బండ్ ను నిర్మించి సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈఓ, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణవేణి రాజన్న చిత్రపటం, ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, తదితరులు ఉన్నారు.