రూ. 7 లక్షలు: ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయారు

రుద్రపూర్: నగదు చోరీ చెయ్యడానికి వెళ్లిన దుండగులు వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకుని మాయం అయిన సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉదయ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ లో జరిగిన ఈ సంఘటనతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు హడలిపోయారు. పంత్ నగర్ లోని అశోక్ లేలాండ్ కంపెనీ మెయిన్ గేట్ దగ్గర ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది. బుధవారం మధ్యాహ్నం బ్యాంకు సిబ్బంది ఏటీఎం మిషన్ లో నగదు పెట్టారు. రాత్రి వరకు అక్కడ పోలీసులు గస్తి తిరిగారు. ఏటీఎం కేంద్రం దగ్గర సెక్యూరిటి గార్డు లేడు. గురువారం వేకువ జామున దుండగులు నగదు లూటీ చెయ్యడానికి ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను ద్వంసం చేశారు. తరువాత ఏటీఎం మిషన్ లో నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేశారు.  వీలు కాకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ఎత్తుకుని వారు వచ్చిన వాహనంలో వేసుకుని పరారైనారు. విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ నీలేష్ ఆనంద్ బర్నె సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం యంత్రంలో రూ. 7 లక్షలు ఉందని బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ నీలేష్ ఆనంద్ బర్నె తెలిపారు.