రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` పథకం ఆపాలని లేఖరాయడంపై కేటీఆర్‌, హరీశ్‌ మండిపాటు
` కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి..
` బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు
` అన్ని పథకాలను కాంగ్రెస్‌ ఆపాలంటుందా..?
` అన్నదాతల పాలిట కాంగ్రెస్‌ నంబర్‌ వన్‌ విలన్‌..
` ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
` రైతులపై కాంగ్రెస్‌ కక్ష కట్టింది
` రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం
` రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం
` మీడియా సమావేశంలో హరీశ్‌రావు
హైదరాబాద్‌ (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకుకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక వైఖరిపైన వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దగ్ధంతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్‌ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రాల్లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కా?ంగ్రెస్‌ తీరును ఎండగట్టాలని కేటీఆర్‌ సూచించారు.కాంగ్రెస్‌ పార్టీ రైతుబంధు అపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇప్పటికే కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కేవలం అక్కసుతో ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్‌ ఎన్నికల కోడ్‌ పేరు చెప్పి రైతులకు సహాయం ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇలా కోడ్‌ పేరుచెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటును కూడా ఆపెయ్యమంటరా..? అని ప్రశ్నించారు. మరీ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? దీంతో అన్ని పథకాలను కాంగ్రెస్‌ ఆపాలంటుందా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.కాంగ్రెస్‌ అంటేనే? రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని, అన్నదాతల పాలిట నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్‌ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని హెచ్చరించారు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్‌ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్‌ తోకలను ప్రజలు కట్‌ చేయడం పక్కా అన్నారు కేటీఆర్‌.ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి.. కర్ణాటక రైతులను కాంగ్రెస్‌ పార్టీ అరిగోస పెడుతుందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్‌ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు.
రైతులపై కాంగ్రెస్‌ కక్ష కట్టింది
కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు.రైతుబందు పొందిన 69 లక్షల రైతులు కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడతారని హెచ్చరించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా రూ.75 వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్‌ రైతులకు డబ్బులు పంచారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఏం చెప్పినా ప్రజలు ఓట్లు వేయరు. 69 లక్షల మంది రైతులు కేసీఆర్‌ కు అనుకూలంగా ఉన్నారు. రైతు బంధు తరహాలోనే పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే కబర్ధార్‌ అని హెచ్చరిస్తున్నా. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నాము. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలు అమలు కావడం లేదు. కర్ణాటక ప్రజలు కొడంగల్‌, గద్వాల్‌ లో కరెంట్‌ విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్‌ పాలనలో నాణ్యమైన కరెంట్‌ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం.  కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బందు కేసీఆర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు శత్రువుగా మారింది. రేపు కాంగ్రెస్‌ పార్టీ వస్టే రైతు బంధుకు రాం రాం చెబుతారు. కేవలం మూడు గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తారు. 11సార్లు కాంగ్రెస్‌ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చాము. ఒక నెల రోజులు కాంగ్రెస్‌ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేం అధికారంలోకి రాగానే ఇస్తాం. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని అన్నారు.రైతుబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేయడం రైతుల పట్ల కాంగ్రెస్‌ వైఖరిని స్పష్టం చేస్తోందని.. మరోమారు కాంగ్రెస్‌ రైతుల పట్ల వ్యతిరేకతను చాటుకుందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ తలకిందులు తపస్సు చేసినా రైతుబంధు లబ్దిదారులు కాంగ్రెస్‌కు ఓటు వేయరన్నారు. అందుకే రైతుల విూద కక్ష పెంచుకున్నారని.. రైతుబంధు ఆపాలని అంటున్నారని మండిపడ్డారు. రైతుల జోలికి వస్తే కబర్డార్‌ అంటూ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. రైతుబంధు ఇవ్వొద్దని ఎలక్షన్‌ కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తమని ఆగం చేసిందని కర్ణాటక రైతులు మొత్తుకుంటున్నారన్నారు. మూడు గంటల కరెంట్‌ చాలని పీసీసీ ప్రెసిడెంట్‌ అంటున్నారని.. కాంగ్రెస్‌ రైతుబంధు ఆపాలని కుట్ర చేస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఇచ్చిన నేత కేసీఆర్‌ అని చెప్పుకొచ్చారు. ఇది రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ అని అన్నారు. ఈసీకి కాంగ్రెస్‌ ఇచ్చిన లేఖను వాపస్‌ తీసుకోవాలని.. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

(‘ఇంటింటికీ మంచినీళ్లు.. 24 గంటల కరెంటునూ ఆపెయ్యమంటారేమో?..
` రైతుబంధును ఆపాలని లేఖలు రాసిన కాంగ్రెస్‌ తోకలు కట్‌ చేయడం పక్కా
` ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికా మంత్రి కేటీఆర్‌ విమర్శలు
హైదరాబాద్‌(జనంసాక్షి): రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్‌ తోకలు కట్‌ చేయడం పక్కా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రైతుబంధును నిలిపివేయాలంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా విమర్శించారు.‘ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో?.. అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా?. కాంగ్రెస్‌ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్‌ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్‌ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు.రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్‌ తోకలు కట్‌ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్‌ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.