వక్ఫ్ బోర్డు బాధితులంతా సంఘటితంగా ఉద్యమించాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పిలుపు
బాధితులు చేసే ఒకరోజు దీక్షకు వస్తానని సంజయ్ హామీ
మేడిపల్లి – జనంసాక్షి
వక్ఫ్ బోర్డు బాధితులంతా సంఘటితంగా ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బోడుప్పల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఎసిని కలుపుకొని వక్ఫ్ బోర్డు బాధితులను ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చిలకనగర్ వెళ్తున్న బండి సంజయ్ కుమార్ ను నాచారం ఇండస్ట్రియల్ ఏరియా బాబా ఫంక్షన్ హాల్ వద్ద కలిశారు. 14వ డివిజన్ కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి వక్ఫ్ బోర్డు బాధితుల గోసను వివరించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… పట్టా భూములను వక్ఫ్ బోర్డు భూములుగా ప్రకటించి రిజిస్ట్రేషన్లు, ఆపేయడం దుర్మార్గ చర్య అన్నారు.  7,000 మంది బాధితులు ఎల్ఆర్ఎస్, ఇంటి, నల్ల పన్నులు, కరెంట్ బిల్లులు కట్టి, బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నారని, అన్ని అనుమతులు చట్టబద్ధంగా తీసుకున్నా కూడా అప్పుడు లేని వక్ఫ్ బోర్డు ఇప్పుడెక్కడిదని ప్రశ్నించారు. అందరూ కలిసి ఒక వెయ్యి ప్లాట్లు ముఖ్యమంత్రికి వారి కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేస్తే మిగతా వాటిని రిజిస్ట్రేషన్లు, అనుమతులన్ని ఇస్తారేమో అని వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రికి బాధితుల భూముల మీద కన్ను పడిందన్నారు. అందుకే రిజిస్ట్రేషన్ ఆపేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ భూముల మీద ఉదాసీనంగా  వ్యవహరిస్తూ, వక్ఫ్ బోర్డు భూముల మీద ప్రేమ ఒలక పోస్తుందన్నారు.
మీ దీక్షకు నేనొస్తా…
వక్ఫ్ బాధితులంతా కలిసి ఒకరోజు దీక్ష చేయాలని, ఆ దీక్షకు తాను వస్తానని సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఉద్యమాలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం ఏ పనులు చేయదన్నారు. 4వ విడత ప్రజాసంగ్రామ యాత్ర పూర్తయిన తర్వాత బోడుప్పల్లో దీక్ష చేపట్టండి.. నేనే దీక్షకు వస్తానని బాధితులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రం రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు హరిశ్వర్ రెడ్డి, బిజెపి రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్, హబ్సిగూడ కార్పొరేటర్ శ్రీవాణి, రామంతపూర్ కార్పొరేటర్ చేతన, జేఏసీ నాయకులు మోత్కూరు రాజు, దివాకర్ రెడ్డి, నర్సింహారెడ్డి, సందీప్ రావు, రాజు, మురళి, శ్రీధర్ రెడ్డి, కొమురయ్య,  బోడుప్పల్ బిజెపి నగర అధ్యక్షులు గోనె శ్రీనివాస్ 19వ డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్షులు ఎస్ఎం ప్రగతి, తలారి రవి యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటాచారి, బిజెపి నగర కార్యదర్శులు బేజాడి బ్రహ్మం, శరత్  రెడ్డి, బిజెపి నగర ఉపాధ్యక్షులు వి. మురళీధర్, యువ మోర్చా  ప్రధాన కార్యదర్శి విశాల్, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి ప్రధాన కార్యదర్శిలు పద్మా రెడ్డి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area