వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి వినతి
………………………………….
త్వరలో ముఖ్యమంత్రి ద్వారా శుభవార్త వింటారు
………………………………….
వాల్మీకి బోయలతో ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్ సెప్టెంబర్ 23 : (జనంసాక్షి) తెలంగాణ లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కి వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు .శుక్రవారం మక్తల్ నియోజకవర్గం లోని ఆత్మకూరు ,అమరచింత ,నర్వ, మక్తల్ ,మాగనూర్ ,కృష్ణ, ఊట్కూరు,మరికల్ మండలాలకు చెందిన రెండు వందల మంది వాల్మీకులు మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలుసుకొని వాల్మీకి బోయల స్థితిగతులను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని వారు ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతిపత్రంలో విన్నవించారు. ఈ నెల 17న రాష్ట్ర రాజధానిలో బంజారా ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గిరిజన రిజర్వేషన్ శాతాన్ని ఆరు నుండి 10 శాతానికి పెంచుతూ వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. ఆ పది శాతం రిజర్వేషన్ జీవోలో వాల్మీకి బోయలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ చెల్లప్ప కమిషన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి బోయల స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందన్నారు. ఆ నివేదిక ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించి న్యాయం చేయాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వాల్మీకి బోయలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అన్నారు .కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి త్వరలోనే వాల్మీకి బోయలకు శుభవార్త చెబుతారని అన్నారు .ఈ వారం రోజుల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం జరగనుందని ఈ సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ అంశంపై నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేస్తారన్న ఆశాభవాన్ని ఎమ్మెల్యే చిట్టెం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం వాల్మీకి మహిళలకు పూర్తి ఎండగా ఉండి వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పాటుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మీ సమస్యను తీసుకువెళ్లి ఎస్టీ జాబితా పునరుద్ధరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు .ఈ సందర్భంగా వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు మాజీ ఎంపిపి అధ్యక్షుడు గడ్డంపల్లి హనుమంతు ,సర్పంచులు నర్వ లక్ష్మణ్, కుర్మయ్య,చింతలయ్య , ఎంపిటిసి టి.నీరజ్ ,మాజీ సర్పంచులు ,సింగిల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్, చిన్నయ్య ,భగవంతు ,మున్సిపల్ కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ, నాయకులు కృష్ణయ్య, సూర్య టైలర్ అంజి, బి.శ్రీనివాసులు, బోయ రవికుమార్, చిన్న వెంకటేష్, గడ్డం నరసింహ, కన్మనూర్ నర్సింహా,, ఎస్.టి.డి శీను,సద్దల వెంకట్రాములు ,మండ్ల విజయ్ ,కర్ని గుజ్జుల గంగాధర్,దేవేంద్రప్ప ,ప్రతాప్ ,శివశంకర్, కురుమయ్య, శ్రీనివాసులు ,బోయ వెంకటేష్, చిన్న కుర్మయ్య, కళ్యాణ్, బి.కుర్మయ్య, గుడిసె అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.