విశాఖలో మెట్రో రైలు కార్యాలయం
దసరా సందర్బంగా ప్రారంభం
విశాఖపట్టణం,అక్టోబర్26(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఆదివారం విశాఖనగరంలో ఎల్ఐసీ భవన్ మూడో అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ను అధికారులు మంత్రులకు వివరించారు. కాగా విశాఖలో 60.29 కిలోవిూటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్, 79,91 కిలోవిూటర్ల మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో అధికారులు ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డీపీఆర్లపై కన్స్టలెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్ధేవంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేసారు. వచ్చే రెండు నెలల్లో మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం కానున్నాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న అవసరాల దృష్ట్యా మెట్రో దూరాన్ని పెంచమని చెప్పారు. మొదట గాజువాక నుంచి కొమ్మాది వరకూ మెట్రో అనుకున్నామని’ ఆయన అన్నారు. దసరా కావడంతో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించాం. యూఎంటీసీ సంస్థకు మెట్రో డీపీఆర్ తయారు చేయమని చెప్పాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం
విమానాశ్రయం వరకూ దూరం పెంచి డీపీఆర్ తయారు చేస్తున్నాం. నవంబర్ మొదటి వారంలో డీపీఆర్ ఇస్తామని చెప్పారు. విశాఖ మెట్రోకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. డీపీఆర్ తయారు చేశాక ముఖ్యమంత్రి ఆమోదంతో టెండర్లు పిలుస్తాం. విశాఖను దేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.