విశాఖ భూ కుంభకోణం కేసులో..  మళ్లీ దర్యాప్తు జరిపించండి


– ఏపీ సీఎం జగన్‌కు లేఖరాసిన గంటా
అమరావతి, సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కు బహిరంగ లేఖ లేశారు. విశాఖపట్నం భూ కుంభకోణం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపించాలని గంటా ముఖ్యమంత్రిని కోరారు. ఈ కేసులో దర్యాప్తు జరిపించాలని పలువురు వైసీపీ నేతలు కోరుతున్నారనీ, వారి డిమాండ్‌ ను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో సిట్‌ ద్వారా విచారణను పున: ప్రారంభించాలని కోరారు. ఈ విషయంలో ఎంత పెద్దవారున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ భూ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను మంత్రిగా ఉండగా సిట్‌ నివేదికను బయటపెట్టాలని కోరారనీ, అయినా బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ నివేదికలోని విషయాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు గంటా శుభాకాంక్షలు తెలిపారు.