వృద్దుడిని తప్పించబోయి డివైడర్ ఎక్కిన బస్సు
ప్రయాణికులకు తప్పిన ముప్పు
రాజమహేంద్రవరం,నవంబర్25 (జనంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలమూరు ఎస్సై సుభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న మార్నింగ్ స్టార్ సంస్థకు చెందిన బస్సు మూలస్థానం అగ్రహారం వద్దకు వచ్చేసరికి అదే గ్రామాని చెందిన ఓ వృద్ధుడు రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో బస్సు డ్రైవర్ ఆ వృద్ధుడిని తప్పించే ప్రయత్నంలో డివైడ్ పైకి ఎక్కించడంతో వృద్ధుడికి గాయాల య్యాయి.. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న యాభై మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే డివైడర్ దాటి ఎదురుగా వచ్చే మరో లారీని ఢీకొని ఉండేదని దీంతో భారీ ప్రమాదంతో పాటుగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణి కులను వేరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలించారు.