వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవికి షాక్!
– ఎస్సీనా.. కాదో తేల్చాలంటూ అధికారులకు ఈసీ ఆదేశం
– 26న మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న జేసీ
గుంటూరు, నవంబర్19 (జనంసాక్షి): గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె ఎస్సీ కమ్యునిటీకి చెందినవారో? కాదో..తేల్చాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమెకు నోటీసులు పంపించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. శ్రీదేవి
ఎస్సీ అని నిరూపించుకునేందుకు అన్ని సర్టిఫికెట్లు, ఆధారాలు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆర్డర్స్ రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక్కసారిగా ఈ ఇష్యూపై ఫోకస్ పెట్టింది. విచారణలో శ్రీదేవి ఎస్సీ కాదని తేలిన పక్షంలో ఆమెను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలుగా ప్రకటించే అవకాశం ఉంది. తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ శ్రీదేవి, టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్పై విజయం సాధించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పడంతో వివాదం రాజుకుంది. శ్రీదేవి ఎన్నిక చెల్లదంటూ.. లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం తరుఫున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యేగా శ్రీదేవి ఎన్నికపై చాలారోజుల నుంచి చర్చ నడుస్తుంది. అయితే ఆమె ఈ విమర్శలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఈసీ ఆదేశాలతో చర్చనీయాంశంగా మారింది.