శివాలయాల్లో కార్తీక పూజలు

దీపాలు వెలిగించిన మహిళలు

రాజమహేంద్రవరం,నవంబర్‌25 (జనంసాక్షి) : పవిత్ర కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు సవిూపంలో గల శైవ క్షేతాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే స్వామి దర్శనం కొరకు శివాలయం నందు బారులు తీరారు.అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు. కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది. స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనంతో పాటు 20 రూ ప్రత్యేక దర్శనం సదుపాయాన్ని దేవస్థానం వారు కల్పించారు.ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.