శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్ర¬్మత్సవాలు

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి,నవంబరు19(జనం సాక్షి): సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్ర¬్మత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, విఎస్‌వో ప్రభాకర్‌, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ మధుసూదన్‌, ఎవిఎస్వో నందీశ్వర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ కోలా శ్రీనివాసులు, ఆలయ ఆర్చకులు ప్రతాప్‌, మణికంఠస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.