షూటింగ్‌లకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతిచ్చారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, టాలీవుడ్‌ ప్రముఖులు నాగార్జున, దిల్‌ రాజు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సురేశ్‌ బాబు, సి, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.  దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇక్కడ కూడా సీఎం జగన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు.