సత్ఫలితాల సాధనకు కృషి చేయాలి

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 10 (జనం సాక్షి): ఎంసెట్‌లో మంచి ఫలితాల సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ పేర్కొన్నారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ గ్రామశివారులోని సాంఘిక సంక్షేమ శాఖ (స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌పూన్స్‌) పాఠశాలకు మంగళవారం ఆయన వచ్చారు. విద్యార్థులకు ఇస్తున్న ఎంసెట్‌ మెగా కోచింగ్‌ క్యాంపును పీటర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలకు ధీటుగా విద్యార్థులకు ఎంసెట్‌ కోచింగ్‌ ఇస్తున్నామని, మెరుగైన ర్యాంకులు సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కోచింగ్‌తో పాటు ఇతర అంశాలను బోధించాలని సూచించారు. సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలనే దిశలో వెళ్లకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సపూన్స్‌లో ఇస్తున్న మెగా ఎంసెట్‌ కోచింగ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాల సాధించేందుకు కృషిచేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ స్మిత్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని కస్తూర్భాంగా గాంధీ, బాలికా విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో స్కైప్‌ విధానం ప్రవేశపెట్టి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని కేజీబీవీ పాఠశాల, మెట్‌పల్లి , హుజురాబాద్‌లోని సాంఘిక సంక్షేమశాఖ పాఠశాల హాస్టల్‌ విద్యార్థులతో స్కైప్‌ ద్వారా ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌పీటర్‌, కలెక్టర్‌ స్మిత్‌ సబర్వాల్‌ మాట్లాడారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ,అందిస్తున్న భోజనం, ఇతర వివరాలను స్కైప్‌ ద్యారా తెలుసుకున్నారు. సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక శ్రద్ధతో కల్పిస్తున్న సదుపాయాలు, పర్యవేక్షణ విధానం బాగుందని సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ కలెక్టర్‌ను ప్రశంసించారు. కార్యక్షిక్షమంలో సోమేశ్‌కుమార్‌, జోనల్‌ అధికారి అరుణకుమారి, ప్రిన్సిపాల్‌ రూపాదేవి, జేడీ నాగేశ్వర్‌రావు, కో అర్డినేటర్‌ అనంతల అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.