సల్వజుడుం చీఫ్ మహేంద్రకర్మ కాల్చివేత
మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్
ఐదుసార్లు మావోయిస్టుల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న కర్మ
పరివర్తన్యాత్రపై మావోయిస్టుల మెరుపుదాడి
30 మంది మృతి, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లాకు బుల్లెట్ గాయాలు
పీసీసీ చీఫ్ సహా మరో 10 మంది కార్యకర్తల కిడ్నాప్
హైదరాబాద్/ఖమ్మం, మే 25 (జనంసాక్షి) :
మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వజుడుం పేరుతో స్పెషల్ పార్టీ పోలీసు (ఎస్పీవో) వ్యవస్థకు పురుడుపోసిన కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మను శనివారం మావోయిస్టులు మట్టుబెట్టారు. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీలు, గిరిజనులకు మధ్య చిచ్చుపెట్టేందుకు ఆయన ప్రారంభించిన సల్వజుడుం ఎందరో అమాయక ఆదివాసీలను మట్టుబెట్టింది. దండకారణ్యంలోని అత్యంత విలువైన సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే మహేంద్రకర్మ ఎస్పీవోల పేరుతో అమాయక గిరిజనులను చేరదీసి తమతో కలిసి జీవనం సాగించి ఆదివాసీలు, గొత్తికోయల్ని హతమారుస్తున్నాడనేది మావోయిస్టుల ఆరోపణ. ఈనేపథ్యంలో మావోయిస్టులకు అతడిని తమ హిట్లిస్ట్లో చేర్చారు. మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు. అతడిపై ఇప్పటికే ఐదు పర్యాయాలు హత్యాయత్నం జరిగింది. కానీ ఆరోసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. కర్మ టార్గెట్గా శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో 30 మంది మృత్యువాతపడ్డారు. కాంగ్రెస్ పరివర్తన్ పేరుతో ఛత్తీస్గఢ్లో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుల క్యాన్వాయ్పై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. మందుపాతర పేల్చి, ఆపై కాల్పులకు దిగడంతో సల్వజుడం చీఫ్ మహేంద్రకర్మ దుర్మరణం చెందాడు. మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదిలియార్ సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 30 మంది చనిపోయినట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, పూల్మతిదేవి, కవాసిలక్మాతో పాటు 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడితో సహా మరో పది మందిని మావోయిస్టులు అపహరించారు. మహేంద్రకర్మ కుమారుడి ఆచూకీ లభ్యం కావడం లేదు. కాంగ్రెస్ పరివర్తన యాత్ర శనివారం సాయంత్రం 3 గంటలకు సుకుమాలో మహేంద్రకర్మ ఆధ్వర్యంలో చేపట్టారు. సమావేశం ముగిసిన తర్వాత 4.30 గంటలకు వారంతకలిసి వాహనాల్లో జగ్దల్పూర్కు బయల్దేరారు. వాహనాలు తోంగ్పాల్-దుర్భాఘాట్ సమీపంలోకి రాగానే అప్పటికే అమర్చిన మందుపాతర పేల్చడంతో క్యాన్వాయ్లోని చివరి వాహనం తునాతునకలైంది. పేలుడుతో బెంబేలెత్తిపోయిన నాయకులు వాహనాలు ఆపేయడంతో భారీ సంఖ్యలో మాటువేసి ఉన్న మావోయిస్టులు విరుచుకుపడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. కర్మ, ఉదయ్ అక్కడికక్కడే మృతిచెందగా శుక్లా, పూల్మతిదేవి, కవాసిలక్మాకు బుల్లెట్ గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేతల వెంట ఉన్న పోలీసులు మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో కాసేపు భీకర కాల్పులు జరిగాయి. సుకుమా, జగ్దల్పూర్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అదనపు బలగాలు కూంబింగ్ చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘాట్రోడ్లో సంఘటన జరగడంతో బాహ్య ప్రపంచానికి సమాచారం చేరడానికి సమయం పట్టింది. సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి సాధ్యం కాలేదు. మందుపాతర, కాల్పుల ఘటనతో భయానక వాతావరణం నెలకొంది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోని సుకుమా, జగ్దల్పూర్, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే పరిస్థితులు లేవు. మావోయిస్టుల ఆధిపత్యమే ఎక్కువ. ప్రత్యేక పోలీసు బలగాలు మినహా రాష్ట్ర పోలీసు వ్యవస్థ అక్కడ పనిచేసే అవకాశమే లేదు. అలాంటి ప్రాంతంలోకి వచ్చిన హిట్లిస్ట్ను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు పరివర్తన్ యాత్రను ఉపయోగించుకున్నారు. మహేంద్రకర్మకు జడ్ కేటగిరి భద్రత ఉన్నా రోడ్డు తనిఖీలు చేసే అవకాశం అక్కడి భద్రతా బలగాలకు లేదు. నిఘా బృందాల పని అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆ ప్రాంతంలోని రోడ్లపై మావోయిస్టులు ఎక్కడపడితే అక్కడ మందుపాతరలు అమర్చి ఉంటారు. ఇటీవల పలుచోట్ల జరిగిన పేలుళ్లు దీనిని రూఢీ చేస్తున్నాయి. మావోయిస్టులపై ఆధిపత్యం సాధించగలననే అతివిశ్వాసంతోనే మహేంద్రకర్మ రోడ్డుమార్గంలో ప్రయాణించాడని, ఇదే ఘటనకు కారణమని విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు.
సల్వజుడుం.. మావోయిస్టులతో శత్రుత్వం
మావోయిస్టులకు వ్యతిరేకంగా మహేంద్రకర్మ 2004లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో) దళాలను ఏర్పాటు చేశాడు. వాటికి సల్వజుడుం అని పేరు పెట్టాడు. మావోయిస్టు కార్యకలాపాలను తీవ్రంగా విమర్శించేవాడు. సల్వజుడుం కార్యకర్తలు పోలీసులకు సహకరిస్తూ మావోయిస్టులపై ఎదురుదాడులకు దిగారు. ఫలితంగా సుకుమా, జగ్దల్పూర్, బస్తర్, బీజాపూర్ జిల్లాల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. ఎస్పీవోలు గిరిజనులను హతమార్చడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ప్రజలకు ఆయుధాలు ఇచ్చి దాడులు చేయించడం సరికాదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పింది. అప్పటి నుంచి ఎస్పీవోల ఆగడాలు కాస్త తగ్గినా వారి మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు ఆగలేదు. మహేంద్రకర్మ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గిరిజనులకు వివరించి మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలోనే మావోయిస్టుల దాడిలో దుర్మరణం చెందాడు. మహేంద్రకర్మ పెద్ద కుమారుడు కూడా ఈ దాడిలో చనిపోయినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్జోగి మాత్రం క్షేమంగా బయటపడ్డారు.
మన్మోహన్, సోనియా దిగ్భ్రాంతి
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీనియర్ నేత, సల్వజుడుం చీఫ్ మహేంద్రకర్మ సహా 30 మందిని మావోయిస్టులు హతమార్చడంపై ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల చర్య ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఇలాంటి చర్యలతో భయోత్పాతం సృష్టించాలనే శక్తుల యత్నాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
మహేంద్రకర్మతో రహమాన్ ఫేస్ టు ఫేస్
సల్వజుడుం చీఫ్ మహేంద్రకర్మను జనంసాక్షి ఎడిటర్ ఎం.ఎం.రహమాన్ 2008, 2009 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ చేశారు. టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన కాలంలో దండకారణ్యంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ధైర్య సాహసాలతో ఛత్తీస్గఢ్లో అడుగుపెట్టారు. మావోయిస్టులు, ఎస్పీవోలు/పోలీసులకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆవిష్కరించారు. దండకారణ్యంలోని సహజ వనరులపై కన్నేసిన బహుళజాతి కంపెనీలకు రాజ్యం వంతపాడుతోందంటూ మావోయిస్టులు ఆదివాసీల పక్షాన నిలిస్తే, మహేంద్రకర్మ గిరిజనులకు తుపాలకులిచ్చి వారిపై యుద్ధానికి పురిగొల్పారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారు అనేది బాహ్య ప్రపంచానికి చాటేందుకు దండకారణ్యంలోకి వెళ్లి అక్కడ నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టారు. మావోయిస్టుల దాడిలో మోస్ట్వాంటెడ్ మహేంద్రకర్మ మృతిచెందిన సందర్భంగా అప్పటి ఇంటర్వ్యూ చిత్రం పాఠకుల కోసం.