సింగరేణిలో అధికార పక్షం సంఘానిదే పైచేయి
గోదావరిఖని,సెప్టెంబర్13(జనంసాక్షి): సింగరేణి కార్మకుల సంక్షేమం లక్ష్యంగానే తెబొగకాసం పనిచేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టిందని నేతలు అన్నారు. సరిహద్దుల్లో దేశసైనికుడు, భూగర్భంలో పని చేస్తున్న సింగరేణి కార్మికుడు ఒకటేనని చెప్పిన నేత సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. అలాంటి సింగరేణి కార్మికుడికి కోల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా వారసత్వాన్ని ప్రకటిస్తే కొన్ని సంఘాలు కుట్రలు పన్ని తమ ఉనికిని చాటుకోవడానికి వారసత్వాన్ని అడ్డుకునేందుకు కోర్టు దకా వెళ్లాయని ధ్వజమెత్తారు. అలాంటి సంఘాలకు బుద్ధిచెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపిస్తే ఏదైనా హక్కులు, నూతన గనులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇతర సంఘాలను గెలిపించినంత మాత్రాన కార్మికులకు ఒరిగేదేమిలేదని స్పష్టం చేశారు. ఓటు అడిగే హక్కు కేవలం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంకి మాత్రమే ఉందన్నారు. ఇతర సంఘాల మాటలు నమ్మే పరిస్థితిలో కార్మికులు లేరు. కార్మికవర్గమంతా మాపక్షానే ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ఇతర సంఘాలను నమ్మరని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు.ఇతర సంఘాలు తమ గొప్పలు చెప్పుకుంటున్నాయె తప్ప కార్మిక హక్కులు ఏం సాధించాయో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చేది లేదు. కార్మికులకు ఒరగబెట్టెది ఏమిలేదని ఆయా సంఘాలను తూర్పారబట్టారు. నూతన గనులివ్వాలన్నా, కార్మికుల హక్కులు పరిరక్షించాలన్న కేవలం టిఆర్ఎస్కే సాధ్యమవుతుందని చెప్పకనే చెప్పారు. అవసరమైతే కార్మికుల కోసం ఎటువంటి నిర్ణయాలైన తీసుకునేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కొత్తగనులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్మికులు వీటిని గమనించి ఓటు టీబీజీకేఎస్కే ఓటు వేయాలని కోరారు.