సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): పెయింటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెయిoటర్ కార్మికుల నూతన మండల సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతు, కనీస వేతనాల చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటివరకు కనీస వేతనాలు మూడు సార్లు సవరణ జరగాల్సి ఉందన్నారు. అంతేగాక కాలపరిమితి ముగిసిన కార్మికుల వేతనాలు పెంచడం లేదని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని, ఈ లేబర్ కోడ్ లన్ని యాజమాన్యలకు లాభాలు పెంచడానికి దోహదపడతాయని, కార్మికవర్గం మరింత శ్రమదోపిడికి గురవుతున్నారని తెలిపారు. కార్మికులను దోపిడీ చేయడమే ఈ కోడ్ ల లక్ష్యమన్నారు. పెయింటర్ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి రూ 5వేలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని,  ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పెయింటర్ కార్మికులకు బైక్ లు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, అంజయ్య, రమేష్,  యాతాకుల వెంకటేశ్వర్లు, నాగరాజు, రంగుల రాంబాబు, కొమ్ము బిక్షం, మేకల వీరభద్రం,  పాల్గొన్నారు.