హైతీలో పెను విపత్తు సృష్టించిన భూకంపం

ఘోర విపత్తుకు 1,297 మంది బలి
మరో 2,800మంది క్షతగాత్రులు
సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు
పోర్టో ప్రిన్స్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): కరీబియన్‌ ద్వీప దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంపం ప్రభావం హైతీలోని అనేక పట్టణాలపై తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భయంతో ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. భారీగా మట్టిపెళ్లలు వంటివి విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా విఘాతం కలుగుతోంది. ఎంతోమంది నిరాశ్రయులు కాగా.. భయంతో ప్రజలంతా రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్‌కేయస్‌ ఒక పట్టాన కోలుకోలేని రీతిలో దెబ్బతింది. ఇక్కడి నుంచి క్షతగాత్రులను పోర్టో ప్రిన్స్‌కు తరలించడానికి మాజీ సెనేటర్‌ ఒకరు ఓ ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘోర విపత్తులో ఆదివారం నాటికి 1,297 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు
దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు స్థానిక అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 7.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కి.విూ.ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి. ఆదివారం తెల్లవారు జామున కూడా 6 ప్రకంపనలు సంభవించాయి. ªూయపడినవారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎంతో మంది తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. ఎవరిని కదిపినా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఆదివారం ఉదయం ఓ మార్కెట్‌లో పళ్లు, తాగునీరు కొంతమేర అందుబాటులో ఉంచగా.. ప్రజలు ఎగబడ్డారు. చాలామంది స్థానికులు లెస్‌కేయస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో తలదాచుకున్నారు. భూకంప తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాల్లో హైతీ ప్రధానమంత్రి ఏరియల్‌ హెన్రీ పర్యటించారు. ఈ కష్టకాలంలో ప్రజలంతా సంఫీుభావంతో ఉండాలని కోరారు. దేశమంతటా నెల రోజుల పాటు అత్యయిక పరిస్థితిని విధించారు. నష్టం తీవ్రత పూర్తిస్థాయిలో అంచనా వేసేంతవరకు అంతర్జాతీయంగా సాయాన్ని కోరబోమని ఆయన తెలిపారు. ‘వీలయినంత మంది కోలుకునేలా చేయడం ఇప్పుడు మాకు అత్యంత ముఖ్యం‘ అని హెన్రీ పేర్కొన్నారు. సుమారు 860 ఇళ్లు నేలకూలినట్లు హైతీ ఉన్నతాధికారి జెర్రీ క్యాండ్‌లర్‌ తెలిపారు. పలుచోట్ల ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు సైతం దెబ్బతిన్నట్లు చెప్పారు. లెస్‌కేయస్‌కు 10.5 కి.విూ.ల దూరంలో ఉన్న ఓ చిన్న ద్వీపంపైనా భూకంపం ప్రభావం పడిరది. అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తరలివచ్చే రిసార్టు బాగా దెబ్బతింది. దాదాపు 1.1 కోట్ల జనాభా ఉన్న హైతీపై భూకంపం దెబ్బ విూద దెబ్బలా మారింది. కరోనా మహమ్మారి వ్యాప్తి.. ఇటీవల దేశాధ్యక్షుడి హత్య.. పెరుగుతున్న పేదరికం వంటి సమస్యలతో ఇప్పటికే ఈ దేశం అల్లాడుతోంది. ఇది చాలదన్నట్లు పెను తుపాను గ్రేస్‌ కూడా హైతీపై ఒకటి, రెండు రోజుల్లో విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో నష్టం మరింత తీవ్రంగా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ దెబ్బకు ఇప్పటికే హైతీలో ఆసుపత్రులు నిండిపోయాయి. మహమ్మారిని ఎదుర్కొనే వనరులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకపోతే విలవిలలాడుతున్న హైతీకి సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. తక్షణం అవసరమైన చర్యలు చేపట్టేందుకు గాను.. అధ్యక్షుడు జో బైడెన్‌ ’యూఎస్‌ఎయిడ్‌’ ఉన్నతాధికారి సమాంతా పవర్‌ను నియమించారు. నష్టాలను అంచనా వేయడంతో పాటు కోలుకునేందుకు సహాయం చేయడంలో ’యూఎస్‌ఎయిడ్‌’ సాయపడుతుందని బైడెన్‌ తెలిపారు. హైతీ ప్రజలకు అమెరికా సన్నిహిత మిత్రదేశంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు అర్జెంటినా, చిలీ దేశాలు కూడా సాయానికి ముందుకొచ్చాయి. హైతీ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంఫీుభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందించడంలో అండగా ఉంటామని పేర్కొంది. భూకంపాలు, హరికేన్లతో హైతీ నిత్యం అల్లాడుతుంటుంది. 2010లో భారీ భూకంపం సంభవించగా దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో సహాయక చర్యలు అంత వేగంగా సాగలేదు. 2018లో సంభవించిన మరో భూకంపంలో 12 మందికి పైగా చనిపోయారు.