హైస్పీడ్ రైల్వే కారిడార్ రక్షణకు చర్యలు
ప్రహారీ గోడల నిర్మాణంతో వాణిజ్య ప్రకటనలకు అవకాశం
న్యూఢిల్లీ,మే5(జనం సాక్షి ): రైల్వేశాఖ వాణిజ్యప్రకటనలు, భూముల లీజు, కేటరింగ్,వాహనాల పార్కింగ్ ల ద్వార ఆదాయం పెంచుకోవాలని యోచిస్తోంది. హైస్పీడ్ రైల్వే కారిడార్లో వాణిజ్య ప్రకటనల కోసం రైలు పట్టాలకు రెండువైపులా ప్రహరీగోడలను నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దీంతో రైలు పట్టాలకు కూడా భద్కరత ఉంటుందని భావిస్తోంది. ఢిల్లీ – ముంబై హైస్పీడ్ కారిడార్ లో మొట్టమొదటిసారి పట్టాలకిరువైపులా ప్రహరీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ గోడల నిర్మాణం ద్వార ప్రయాణికుల భద్రతతోపాటు వాణిజ్య ప్రకటనల ద్వార ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. హైస్పీడ్ రైల్వేకారిడార్లో ప్రహరీ గోడ నిర్మాణం ద్వార రైళ్ల శబ్ద కాలుష్యాన్ని 20 డెసిబుల్స్ మేర తగ్గించవచ్చని భావిస్తోంది. వీటి నిర్మాణం వల్ల రైలు పట్టాల భద్రతతోపాటు రైల్వే స్థలాల ఆక్రమణదారుల బారి నుంచి పరిరక్షించవచ్చని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. గంటకు 160 కిలోవిూటర్ల వేగంతో రైళ్లు వెళుతున్న ఈ పట్టాలపై ప్రహరీల నిర్మాణంతో పశువులు రాకుండా ప్రమాదాలను నివారించవచ్చని భావిస్తున్నారు.