‘2జి ‘పై లోతైన చర్చకు డిఎంకె నోటీస్‌

న్యూఢిల్లీ: ‘2జీ ‘ స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన డిఎంకె ఈ అంశంపై ప్రత్యేక చర్చను కోరుతూ సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చింది, కాగ్‌ మాజీ అధికారి ఆర్పి సింగ్‌ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకె నేత టీఆర్‌ బాలు ఈ నోటీస్‌ ఇచ్చారు. ఈ కుంభకోణంలె వాటిల్లిన నష్టం మొత్తాన్ని ‘ భారీగా పెంచి ‘ చూపినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నదన్నారు.

తాజా పరిణామాలతో ఈ మొత్తం అంశంలో కొత్త కోణాలు కనిపిస్తున్నందున ‘ ఆడిట్‌ విధానాలు – కాగ్‌కు గల రాజ్యాంగబద్ధత ‘పైలోతైన చర్చ జరగాలని ఆ నోటీస్‌లో బాలు పేర్కొన్నారు.

2జీ కేటాయింపుల ఆర్పీ సింగ్‌ ప్రకటన నేపథ్యంలో ఈ అంశంపై యుపిఎ మిత్రపక్షమైన డిఎంకె గనుక నోటీస్‌ ఇస్తే పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి వి నారాయణ స్వామి పేర్కొనడంతో డిఎంకె నేత బాలు ఈ చర్యకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నది.

‘2జి’ కి సంబంధించి రూ.1.76 లక్షల కోట్ల భారీ నష్టాన్ని  చూపుతున్న తుది నివేదికలో తన పై అధికారులు ఇచ్చిన ‘ రాతపూర్వం ఆదేశం ‘ వల్లే సంతకం చేశానని మాజీ కాగ్‌ అధికారి సింగ్‌ చెప్పుకున్నారు.

పార్లమెంట్‌లో రగులుతున్న ‘ ఎఫ్‌డిఐ ‘ అంశంలో ప్రభుత్వానికి డిఎంకె మద్దతు కోసం కేంద్ర మంత్రి ఆజాద్‌ ఆదివారం చెన్నై వచ్చి ఈ పార్టీ అధినేత కరుణానిధితో సమావేశమైన మరునాడే లోక్‌సభలో బాలు నోటీస్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కుంభకోణం దెబ్బకు డిఎంకె ఎంపీ, నాటి టెలికాం మంత్రి ఎ రాజా పదవిని కోల్పోవడమేగాక జైలు పాలు కావలసిన వచ్చింది.

ఇటీవల కేంద్రం నిర్వహించిన 2 జి స్పెక్ట్రమ్‌ వేలం కేవలం రూ. 9,000 కోట్లకు మాత్రమే పరిమితమై అంచనాలు తల్లకిందులు కావడంతో గతంలో భారీ నష్టాం జరిగిందన్న కాగ్‌ సభ్యుల నియామకంలో మార్పులకు పిలుపునిచ్చారు.