20 ఢిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర

 

నిజామాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వివిధ సమస్యలపై ఈ నెల 20 న దిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఏఐకెఎమ్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు. దీనికి వేలాదిగా రైతులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 3000 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతు దుక్కి దున్నితే దుఃఖమే మిగులుతుందని, అప్పుల భారిన పడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.పంజాబ్‌లో కూడా ఆత్మహత్యలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికి స్వామినాథన్‌ సిఫార్సులు చేసిన పంట ఖర్చులపై 50 శాతం అదనంగా ధర నిర్ణయిస్తే ఆత్మహత్యలు నివారించవచ్చనడం సిగ్గుచేటన్నారు. భాజపా ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచడానికి రైతు యాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు.