ఖాతా తెరువని ఢిల్లీ

– నాల్గో మ్యాచ్‌లోనూ పరాభవం
– పుంజుకోని టాప్‌ ఆర్డర్‌
– పాఠాలు నేర్వని బాట్స్‌మెన్‌
ఢిల్లీ :ఢిల్లీలోని ఫిరోజ్‌షా మైదానంలో శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ 4 బంతులు ఆడి ఒక్క పరుగైనా చేయకుండానే వెనుదిరిగాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో ఆనంద్‌రాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వీరెంద్ర సెహ్వాగ్‌ 10 బంతుల్లో 12 పరుగులకే వికెట్‌ కోల్పోయాడు. శర్మ విసిరిన బంతికి వైట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జయవర్ధనే కూడా 14 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి క్యాచ్‌ ఔటయ్యాడు. జునేజా 22 బంతులు ఆడి 15, బోతా 14 బంతుల్లో 9 చేశారు. పటాన్‌, జాదవ్‌ కొద్దిసేపు నిలకడగా ఆడారు. పటాన్‌ 30 బంతుల్లో 23, పెరేరా బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. జాదవ్‌ 20 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్కెల్‌, నదీం ఎలాంటి పరుగులు చేయకుండానే వెంట వెంటే ఔటయ్యారు. యాదవ్‌ 5 బంతుల్లో 6 పరుగులు చేశాడు. 115 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు 19.2 ఓవర్లలో గెలిచారు. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన పీఏ రెడ్డి 8 బంతుల్లో ఒక్క పరుగుకే రనౌట్‌ అయ్యాడు. పటేల్‌ 19 బంతుల్లో 19 పరుగులు చేశాడు. సంగక్కర 28 బంతుల్లో 28 పరుగులు చేసి నదీం బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. విహారి 23 బంతుల్లో 17 పరుగులు చేసి బోతా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వైట్‌ 8 బంతుల్లో 4, పెరారె 2, అశీశ్‌రెడ్డి 16 పరుగులు చేశారు. మిశ్రా 16, స్టెయిన్‌ 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్‌ జట్టులో స్టెయిన్‌, శర్మ, పెరారె రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆనంద్‌రాజన్‌, మిశ్రా ఒక్కో వికెట్‌ తీశారు. ఢిల్లీ జట్టులో నదీం 2, మార్కెల్‌ 2 వికెట్లు తీయగా పటాన్‌, బోతా ఒక్కో వికెట్‌ తీశారు.