మన ఊరు.. మన ప్రణాళిక

5

ఇన్‌చార్జీలుగా ఐఏఎస్‌లకు బాధ్యతలు

కరీంనగర్‌కు పార్థసారథి

హైదరాబాద్‌కు సోమేశ్‌కుమార్‌

రంగారెడ్డికి బీఆర్‌ మీనా

28 వరకు జిల్లాల్లో పర్యటించండి

సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) :

తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామాల అభివృద్ధి కీలకమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం మరో బృహత్‌ ప్రణాళికను తీసుకువచ్చారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుకు ఐఏఎస్‌ అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 12 నుంచి 28 వరకు అధికారులు తప్పనిసరిగా రెగ్యులర్‌గా జిల్లాల్లో పర్యటించాలని ప్రభుత్వం ఆదేశించింది. పర్యటన సందర్భంగా ప్రాధాన్యత కలిగిన అన్ని సమావేశాల్లో పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. పర్యటన నివేదికలను అధికారులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక శాఖలకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గ్రామ స్థాయి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘మన ఊరు-మన ప్రణాళిక’ పథకం ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయన తీవ్రంగా దృష్టి సారించారు. కచ్చితంగా, పారదర్శకంగా ఈ పథకాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పథకం అమలుకు ఐఏఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన ఊరు-మన ప్రణాళిక నిర్వహణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. హైదరాబాద్‌ ఇన్‌చార్జిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌కు, కరీంనగర్‌ జిల్లాకు పార్థసారథి, రంగారెడ్డి జిల్లా బాధ్యతలను బీఆర్‌ విూనాకు, మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను వెంకటేశంకు అప్పగించారు. అలాగే నల్లగొండ జిల్లా బాధ్యతలు అనిల్‌కు, మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జిగా జగదీశ్‌, వరంగల్‌ జిల్లాకు రాహుల్‌ బొజ్జా, ఖమ్మంకు నిరభ్‌ప్రసాద్‌ కుమార్‌ ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. నిజామాబాద్‌ జిల్లా బాధ్యతలు జనార్దన్‌రెడ్డికి, ఆదిలాబాద్‌ బాధ్యతలు అశోక్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28 వరకు తప్పకుండా జిల్లాల్లో పర్యటించాలని, ప్రాధాన్యత కలిగిన అన్ని సమావేశాల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. పర్యటన వివరాలను నివేదిక రూపంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక శాఖకు అందజేయాలని ఆదేశించింది.