అంతర్జాతీయ క్రీడాసిటీగా హైదరాబాద్‌

3
పతక విజేతలకు కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, ఆగస్టు 6( జనంసాక్షి) : అంతర్జాతీయ క్రీడాసిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్‌లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో బ్యాడ్మింటన్‌ కోచ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్‌, పీవీ సింధు, గుత్తా జ్వాల, గురుసాయి దత్‌, షూటర్‌ గగన్‌ నారంగ్‌ ఉన్నారు. స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్‌లో కశ్యప్‌ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. వీరికి సిఎం అభినందనలు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండంగా ఉంటుందన్నారు. అనంతరం  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ కామన్వెల్త్‌ క్రీడల్లో విజేతలైన రాష్ట్ర క్రీడాకారులకు ప్రోత్సహకాలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. గోల్కొండ కోట వేదికగా జరిగే పంద్రాగస్టు వేడుకల్లో కామన్వెల్త్‌ విజేతలను సన్మానిస్తామని ఆయన తెలిపారు. కామన్వెల్త్‌ విజేతలకు ఈ నెల 15న ప్రోత్సహకాలు అందజేస్తామని సీఎం చెప్పినట్లు చెప్పారు. బంగారు పతకం సాధించిన కశ్యప్‌కు రూ. 50 లక్షల పారితోషికం, వెండి పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 25 లక్షల పారితోషికం, రజత పతకం సాధించిన విజేతలకు రూ. 15లక్షలు పారితోషికం అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆస్టేల్రియా ఓపెన్‌లో గెలుపొందిన సైనా నెహ్వాల్‌కు రూ. 20 లక్షలు పారితోషికం ఇస్తామని పేర్కొన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి రూ. 3లక్షల పారితోషికం ఇస్తామన్నారు.