ఇరాక్‌పై వైమానిక దాడులకు ఒబామా గ్రీన్‌సిగ్నల్‌

2

వాషింగ్టన్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :

ఇరాక్‌పై వైమానిక దాడులకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇస్లాం లోకి మారండి లేదా మరణించం డంటూ ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ఇచ్చిన పిలుపుతో ఇరాక్‌లోనరమేథం సాగుతోంది. దాంతో

వేలాది ప్రాణాలు బలవుతున్నాయి. ఇరాక్‌ మొత్తం రక్తసిక్తంగా మారింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి సవిూపంలో ఉన్న ‘తమ సైన్యాన్ని కాపాడుకోడానికి’ లక్షిత వాయుదాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తమ సైన్యానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత.. ఆయనీ నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన కూడా చేసేశారు. ఇరా క్‌లోనిసైన్యానికి సహాయ సహకారాలు అందిస్తూ ఆ దేశంలో ఉన్న అమెరికన్లు, ఇతర విదేశీయులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని కోరారు. అందులోభాగంగా ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులపై వైమానిక దాడులు చేసి అంతమొందించాలని ఒబామా ఆదేశించారు. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఆకలి తాళలేక అల్లాడిపోతున్నారు. దాంతో అలాంటి ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవించకుండా ఉండేందుకు ఆహార పదార్థాలను కూడా హెలికాప్టర్ల ద్వారా పంపాలని ఒబామా చెప్పారు. కుర్దిష్‌ రాజధాని అర్బిల్‌ ప్రాంతంలో అమెరికా సైన్యాలు ప్రస్తుతం ఉన్నాయి. వారిని రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యంగా అమెరికా ఈ చర్యలు మొదలుపెట్టింది. ఇస్లాంలోకి మారతారా లేక చస్తారా అంటూ ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ఇరాక్‌లోకి

అతిపెద్ద నగరమైన కోరకోష్‌లోని క్రిస్టియన్‌లను బెదిరించారు.

దాంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ నగరాన్ని వదిలి పర్వత ప్రాంతాలకు తరలిపోయారు. ఆ నగరంలోకి ప్రవేశించేందుకు ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఉక్కుపాదం మోపాలని ఒబామా ఉన్నతాధికారులను ఆదేశించారు.