నేడే మెదక్‌ ఫలితం

4
పటాన్‌చెరు గీతం యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు

భారీ బందోబస్తు ఏర్పాటు : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా

మెదక్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :

మెదక్‌ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనుంది. పటాన్‌చెరు గీతం యూనివర్శిటీ లో ఓట్ల లేక్కింపు జరుగనుంది. ఈమేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా సోమ వారం తెలిపారు. మెదక్‌ ఉపఎన్నికకు సంబంధించి కౌం టింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూరి ్తచేశారు. మెదక్‌ పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడనుంది. ఇందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది తలమునకలయ్యాన్నారు. ఉప ఎన్నికల ఫలితం ఓటింగ్‌ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే వెలువడే అవకాశముంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కించిన ఓట్లని క్రోడీకరించుకుని అభ్యర్థులవారీగా ఓట్ల వివరాల్ని అధికారులు లెక్కిస్తారు. ఈవీయంలని అత్యంత పటిష్టమైన భద్రత మధ్య పటాన్‌చెరు మండలం రుద్రారం సవిూపంలో ఉన్న గీతం యూనివర్సిటీలో భద్రపరిచారు. పార్లమెంట్‌ పరిధిలోఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాల ఓట్లని వేర్వేరుగా లెక్కించనున్నారు.. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 98 టేబుళ్లని ఏర్పాటు చేశారు. ఇక లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు గుర్తింపు కార్డుల్ని కలెక్టర్‌ కార్యాలయం నుంచి అందించనున్నారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక సహాయక అధికారితో పాటు సూపర్‌వైజర్‌, సూక్ష్మపరిశీలకుడు ఉంటారు. ఇలా ఒక నియోజకవర్గ కేంద్రంలో అన్ని టేబుళ్ల వద్ద ఉండే సిబ్బందితోపాటుగా అదనంగా మరో 25మందికిపైగా సిబ్బంది ప్రత్యామ్నయంగా ఉంటారు. సుమారు 20నిమి షాల వ్యవధిలోనే ఒక రౌడు ఫలితం వచ్చేస్తుంది. లెక్కింపు ఓట్లు ఎక్కువగా ఉన్న గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశముంది. ఇక్కడ మొత్తం 1,73,271 ఓట్లని లెక్కించాల్సి ఉంటుంది. ఇక నర్సాపూర్‌. పటాన్‌చెరు నియోజకవర్గాల్లోనూ లెక్కింపు కాస్త ఆలస్య మయ్యే అవకాశముండటంతో ఇక్కడి ఓట్లపై గుబులు రేకెత్తే అవకాశ ముంటుంది. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. సంబంధిత పార్టీలు, అభ్యర్ధుల ఏజెంట్లు ఉదయం 7గంటలకే వారికి కేటాయించిన టేబుల్‌ వద్దకు చేరుకోవాలి.  జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన పాస్‌ సంతకం ఉన్న వారినే లెక్కింపు కేంద్రాలకు అనుమతిస్తారు.  ప్రజా ప్రతినిధులకు కౌంటిక్‌ కేంద్రంలోకి అనుమతి ఉన్నా వారి వెంట వచ్చే సెక్యూరిటీ గన్‌మెన్లకు లోనికి అనుమతించరు. ఉప ఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన గీతం యూనివర్సిటిలోని స్ట్రాంట్‌ రూంను కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా పరిశీలించి కౌంటింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో  మెదక్‌ ఎంపీ స్థానంలో ఎన్నడూ లేనంతగా 3.97 లక్షల ఓట్ల మెజార్టీతో సీఏం కేసీఆర్‌ సాధించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీచేశారు. ప్రచారం ప్రారంభం నుంచి కాంగ్రెస్‌, భాజపా, తెదేపాలు ప్రభుత్వ విధానాలే లక్ష్యంగా విమర్శలు కురిపించాయి. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదంటూ పదేపదే ఆరోపించాయి. స్థానిక సమస్యలను సైతం ప్రచారాస్త్రాలుగా చేసుకుని ముందుకుసాగాయి. జిల్లాలో రైతులపై లాఠీఛార్జీ, పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపు, పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జిల్లాల ఏర్పాటు విషయం.. తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. మూడు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందంటూ ప్రచారం సాగించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం తగ్గడం, ప్రతిపక్షాల ప్రచారం తమ అభ్యర్థిపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న ఉత్కంఠ తెరాస శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్‌ శాతం తగ్గింది. తగ్గిన పోలింగ్‌ శాతంతో ఎలాంటి ఫలితం ఇస్తుందో అన్నది  తెరాస నేతల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నిక కంటే ఒక్క ఓటూ తగ్గకుండా తెరాస ఎంపీ అభ్యర్థిని అయిదు లక్షల మెజార్టీతో గెలిపించాలని నర్సాపూర్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పిలుపునిచ్చారు. సమగ్ర సర్వేకు వచ్చినట్లుగా వచ్చి ఉప ఎన్నిక పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. పోలింగ్‌ శాతం గతం కంటే 9.56 శాతం తగ్గడంతో ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.