9న ఆశా కార్యకర్తల జిల్లా మహాసభ

అశ్వారావు పేట గ్రామీణం:ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తు కార్యాచరన ప్రణాళిక కోసం జూన్‌ 9న ఖమ్మంలో ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను నిర్వహించనున్నట్లు ఆ సంఘం (సీఐటీయూ) మండల అధ్యక్షురాలు దమయంతి తెలిపారు.స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో దమయంతి మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్యరక్షణకు నిత్యం కష్టపడే కార్యకర్తలకు ఆరు నెలలుగా వేతనాలు రాలేదని, నాలుగు నెలల పారితోషకాలు రావాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెం:3 ప్రకారం నెలకు రూ.400 వేతనాన్ని పెంచుతానని చెప్పన ప్రభుత్వం మాట తప్పిందన్నారు, అసెంబ్లీ ముట్టడి సమయంలో హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు భారతి, శ్రీదేవి, లక్ష్మీ పాల్గొన్నారు.