98.19 శాతానికి చేరిన రికవరీ రేటు

12వేలకు పడిపోయిన కరోనా కేసుల సంఖ్య
న్యూఢల్లీి,అక్టోబర్‌26(జనంసాక్షి):  దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది. సోమవారం 11,31,826 మందికి కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్‌ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్ల మార్కును దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 0.48 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ మృతుల సంఖ్యను సవరిస్తోంది. దాంతో నిన్న 356 మరణాలు నమోదుకాగా.. మొత్తంగా 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. సోమవారం ఒక్కరోజే 64,75,733 మంది టీకా వేయించుకున్నారు.