అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. సారీ చెప్పిన టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్
అహ్మదాబాద్ (జనంసాక్షి): అహ్మదాబాద్లో గత గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. లండన్కు బయల్దేరిన డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: చంద్రశేఖరన్
ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు రావడం లేదని చంద్రశేఖరన్ అన్నారు. “టాటా సంస్థ నడిపే విమానయాన సంస్థలో ఈ ప్రమాదం జరిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రాథమిక స్థాయి విచారణ ఫలితాలు వెలువడటానికి సుమారు ఒక నెల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. విమానం అత్యంత భద్రతా ప్రమాణాలతోనే కార్యకలాపాలు సాగిస్తోందని, ఇటీవలే నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు బయటపడలేదని ఆయన వివరించారు. “విమానం కుడివైపున ఉన్న ఇంజిన్ను మూడు నెలల క్రితమే, అంటే 2025 మార్చి నెలలో ఓవర్హాలింగ్ సమయంలో అమర్చాం. ఎడమవైపు ఇంజిన్కు చివరిసారిగా 2023 జూన్ లో నిర్వహణ పనులు చేపట్టారు. తదుపరి షెడ్యూల్ ప్రకారం దానికి 2025 డిసెంబర్ లో నిర్వహణ చేపట్టాల్సి ఉంది” అని ఆయన వివరించారు. కెప్టెన్ సభర్వాల్కు 11,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉండగా, మరో పైలట్ కుందర్కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని తెలిపారు. “ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎలాంటి నిర్ధారణకూ రాలేము. బ్లాక్ బాక్స్, ఇతర రికార్డర్ల ద్వారా ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి. అప్పటి వరకు వేచి ఉండాలి” అని చంద్రశేఖరన్ అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించిందని ఆయన వెల్లడించారు.