కాళేశ్వరం నోటీసుల నేపథ్యం..
తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్, హరీశ్ మంతనాలు
గజ్వెల్(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్రావుతో సమాలోచనలు జరిపినట్లు- సమాచారం.విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అంశాలు, ఎక్కడా లోపాలు జరిగాయన్న విషయాలపై పూర్తిగా ఆరా తీసినట్లు-, ఇది కాకుండా, నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఏం సూచించింది? బ్యారేజీ కుంగడపై సాంకేతిక కారణాలు ఏమిటన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడినట్లు-, కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. మొత్తంగా సమాధానాలు సిద్దం చేసుకుని కమిషన్ ముందుకు హాజరయ్యేలా కెసిఆర్ సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.