పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌ లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే,ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది.కాగా, జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ సైనికులను హతమార్చారు. అనంతరం పాక్‌ ఆర్మీ ఆపరేషన్‌ చేపట్టి బందీలను విడిచిపెట్టింది. అయితే, 214 మంది పాక్‌ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.