పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

 

 

 

 

 

నవంబర్ 17, (జనంసాక్షి)హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారని చెప్పారు. కళ్ల ముందే పండించిన పత్తి ఈ చలికాలపు తేమకు పాడవుతోంటే ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో మొద్దు నిద్ర నటిస్తున్నాయని మండిపడ్డారు. నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేశారంటేనే రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ళ సంక్షోభానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.

తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడింగ్ అంటూ కుంటి సాకులతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోలు నిరాకరిస్తుంటే, దానికి జిన్నింగ్ మిల్లుల అవినీతి తోడై రైతన్న నడ్డి విరుస్తున్నాయని చెప్పారు. మద్ధతు ధర దొరకక, మధ్య దళారులకు తెగనమ్ముకుని రైతులు నష్టాల పాలవుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.