దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు

తెలంగాణ (జనంసాక్షి) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 5000 మంది భద్రతా సిబ్బంది (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు) పాల్గొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో 300 నుంచి 400 మంది మావోయిస్టులు, వీరిలో హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టి, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ భారీ ఆపరేషన్‌తో భీమవరం పాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు వంటి సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. మరోవైపు, మావోయిస్టులు కూడా భద్రతా బలగాలను ప్రతిఘటిస్తున్నారని, అడవుల్లో భారీగా మందుపాతరలు అమర్చామని హెచ్చరికలు చేస్తున్నారని తెలుస్తోంది.

తాజావార్తలు