కశ్మీర్ లో ముష్కరుల కోసం కొనసాగుతున్న భారీ వేట.. పాకిస్థాన్ పై ఇండియా దాడి చేసే అవకాశం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయను భయాందోళనల్లో ముంచెత్తింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దాడి జరిగినప్పటి నుంచి కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ, ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాడిలో సుమారు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని, వీరిలో 5 నుంచి 7 మంది పాకిస్థాన్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దాడి సమయంలో ఉగ్రవాదులు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారని, మహిళలు, చిన్నారుల జోలికి వెళ్లలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు తెలుస్తోంది.ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్‌ దేశాలకు చెందిన ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధృవీకరించారు.