ఇక పెద్ద నోట్ల అవసరం లేదు: సీఎం చంద్రబాబు
దేశంలో అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడమే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం కడపలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో పెద్ద విలువ కలిగిన నోట్ల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, “దేశంలో అవినీతిని గణనీయంగా తగ్గించాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలి. డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వచ్చాక, ఇక పెద్ద నోట్ల అవసరం లేదు” అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న పాలన పట్ల ప్రతి కార్యకర్త గర్వపడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. “మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది. సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అమలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతాం” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు.