త్వరలో మంత్రి వర్గ విస్తరణ

` గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి
` కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం
` పలు అంశాలు చర్చ
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర కేబినెట్‌ ను విస్తరించొచ్చు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ సోమవారం కలుసుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సిఎం భేటీ అయ్యారు. రానున్న కొన్ని రోజుల్లో కేబినెట్‌ విస్తరణ ఉండనున్నదన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గతవారం ఢల్లీికి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌ ప్రధాన నాయకులతో కేబినెట్‌ విస్తరణ గురించి చర్చించారని తెలిసింది. ఐదు నుంచి ఆరుగురు మంత్రులను కేబినెట్‌ లోకి తీసుకోవడం ఖరారయిందని తెలుస్తోంది. మంత్రి పదవులు వస్తాయని చాలా మంది గత ఆరు మాసాలుగా ఎదురుచూస్తున్నారు.రేవంత్‌ రెడ్డి, ఆయన 11 మంది కేబినెట్‌ కొలీగులు 2023 డిసెంబర్‌ 7న ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా రాష్టాన్రికి గరిష్ఠంగా 18 మంది మంత్రులు ఉండొచ్చు.ఇదిలావుండగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రానున్నఅసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి గవర్నర్‌కు వివరించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నామినేటెడ్‌ ఎంఎల్‌సిల అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు గవర్నర్‌ కోటా కింద నామినేట్‌ అయిన ఎం.కోదండరామ్‌, అవిూర్‌ అలీ ఖాన్‌ నామినేషన్లను కొట్టేసింది. గవర్నర్‌ ఉత్తర్వును 2023 సెప్టెంబర్‌ 19న హైకోర్టు కొట్టేసింది. బిఆర్‌ఎస్‌ నాయకులు శ్రవన్‌ దాసోజు, కె. సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరించింది. ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, గవర్నర్‌ కోటా కింద వారి నామినేషన్లను తిరస్కరించారు. గవర్నర్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ బిఆర్‌ఎస్‌ నాయకులు హైకోర్టులో రిట్‌ పిటీషన్లను దాఖలు చేశారు. గవర్నర్‌ ఎంఎల్‌ సిలను నియమించేలా వారు అప్పీలు చేసుకున్నారు. ఈ క్రమంలో సిఎం భేటీలో ఈ అంశాలు కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ప్రధానంగా కేబినేట్‌ భేటీ, అసెంబ్లీ సమావేశలు, నామినేటెడ్‌ ఎమ్మెల్సీల అంశాలను చర్చించి ఉంటారని అనుకుంటున్నారు.
పీయూష్‌గోయల్‌తో సీఎం రేవంత్‌ సమావేశం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ను సీఎం రేవంత్‌ తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్‌ లోని తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డితో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.