పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 12 : పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్‌ చేశారు. పెద్ద రైతులకు నష్టపరిహారం సక్రమంగా అందుతున్నప్పటికీ సన్నకార రైతులకు నష్టపరిహారం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు ఎన్నో రేట్లు పెరుగుతున్నా రైతుల పంటలకు మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు మేరకు వరి మద్దతు ధర 2500 ధర ఇవ్వాల్సి ఉండగా రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదని అన్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక వేసిన పత్తి విత్తనాలు మోలగక రైతులు ఎంతో నష్టపోయారని అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.