పుణెలో ఘోరం
ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు
పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యటకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. పుణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందమాలా పర్యాటక ప్రాంతానికి ఆదివారం పర్యటకులు పోటెత్తారు. అక్కడున్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడిన క్రమంలోనే కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అనేక మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. పలువురిని రక్షించినప్పటికీ.. అనేక మంది జాడ తెలియరాలేదు.ఇంద్రాయణి నదిపై ఈ ఇనుప వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెల్లడిరచారు. ఇది కేవలం కాలినడక మార్గమే. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని, అందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారని చెప్పారు. ఇదిలాఉంటే, మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణెతోపాటు, పింప్రీ చించ్వాడ్ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.