ప్రత్యేక తెలంగాన ఏర్పాటు విషయంలో మన్మోహన్‌సింగ్‌ మోసగిస్తున్నారు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చుతున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రాంతంపై ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్యర్యంలో తెలంగాణ ఉద్యమం-ప్రస్తుత పరిస్థితులు, ఉపాధ్యాయుల కర్తవ్యం అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై ప్రధాని మాట్లాడకుండా ఉంటున్నారని, ఆ అంశంపై తప్పనిసరిగా నోరు విప్పాల్సి వస్తే ఏకాభిప్రాయం కావాలి కాదా.. హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి.. అని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. దోపిడి దౌర్జన్యం ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందన్నారు.  సీనియర్‌ పాత్రికేయులు టంకశాల అశోక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారం కోసం ఏదైన చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేసి రాష్ట్రం సాధించుకోవాలన్నారు. ఏపీటీఎఫ్‌ పూర్వ అధ్యక్షులు నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ పోరాటంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలను కల్పించి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఐకాస స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సూర్యం మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను జయప్రదం చేయాలన్నారు. అనంతరం పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌, రవిచంద్ర, చంద్రమౌళి, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.