మోదీ, కేసీఆర్‌లు.. 

బానిస సిద్ధాంతాన్ని ఆవలంబిస్తున్నారు
– కేంద్ర రాష్ట్రాల సంపద కొందరి చేతుల్లోనే ఉంది
– ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌కు బుద్ది చెబుతాం
– విలేకరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
హైదరాబాద్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో దేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాయని, కానీ మోదీ, కేసీఆర్‌ పాలనలో కేంద్ర, రాష్ట్రాల సంపద కేవలం కొందరి చేతుల్లోకే వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్యం తెచ్చిన కాంగ్రెస్‌.. దేశాభివృద్ధికి ఎంతో పాటుపడిందని పేర్కొన్నారు. పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకుల జాతీయం వంటి  దేశాభివృద్ధికి తోడ్పడే పలు సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్‌ దేశాన్ని పాలించింది కానీ మోడీ, కేసీఆర్‌ విధానాల వల్ల దేశ, రాష్ట్ర సంపద కొంత మంది సంపన్నుల చేతుల్లోకి వెళ్తోందని మల్లు ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ బానిస సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ రాహుల్‌ గాంధీకి మెచ్యూరిటీ లేదని అంటున్నారని.. ఇది ఆయన అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. సరూర్‌ నగర్‌ సభలో రాహుల్‌ చాలా మెచ్యూరీటితో మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం అంటే చీఫ్‌ సెక్రెటరీ, డీజీపీ అన్నట్లుగా కేసీఆర్‌ బావిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చేప్తారని జోస్యం చెప్పారు. అలానే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.