రుణాల మంజూరీకి లబ్దిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగస్టు 2 : రాజీవ్‌ యువశక్తి, ఎస్సీ, బిసి, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాల మంజూరీకై లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కార్పోరేషన్‌ కమీషనర్‌ రామకృష్ణారావు తెలిపారు. నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో రాజీవ్‌ యువశక్తి, బిసి, ఎస్సీ, మైనార్టీలకు అర్బన్‌ పరిధిలో గురువారం నాడు లబ్దిదారుల ఎంపిక జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, లక్ష రూపాయల నుంచి 2.5లక్షల వరకు లబ్దిదారులకు రుణాలు అందజేస్తున్నామని, ప్రతీ యూనిట్‌కు 30వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతీలబ్దిదారుడు బ్యాంక్‌ గ్యారెంటీ, ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తు తీసుకురావాలన్నారు. 60వేల యూనిట్‌కి సబ్సిడీ తక్కువ ఉంటుందన్నారు. అన్ని శాఖల బ్యాంక్‌లు ఇక్కడే ఉన్నాయని, లబ్దిదారులతో తాము దరఖాస్తు చేసుకున్న యూనిట్‌ని తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన లబ్దిదారులకు తొందరలోనే రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఆడిటోరియంనకు మైనార్టీ లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్‌ ఎఇ రషీద్‌, బిసి, మైనార్టీ, ఎస్సీ, కార్పోరేషన్ల పిడిలు, బ్యాంక్‌ అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.