రేవంత్‌ వ్యూహాత్మక అడుగులు

కాంగ్రెస్‌ పెద్దలతో పేచీలేకుండా భేటీలు

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి పార్టీలో వ్యతిరేకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే సీనియర్లతో పేచీ రాకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రేవంత్‌ అడుగులు వేస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డిలను కలుసుకున్న ఆయన ఇక వరుసబెట్టి కాంగ్రెస్‌ పెద్దలను కలుసుకుంటూ వారి సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. వారిచ్చే సూచనలు, సలహాలతో పాటు, సమాచారం కూడా పనికివస్తుందని రేవంత్‌ భావిస్తున్నారు. పనిలో పనిగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అడుగులు వేయాలన్నది కూడా చర్చిస్తున్నారు. ఇదిలావుంటే పాదయాత్ర లాంటిది చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌ వైఎస్‌ బాటలో చేవెళ్ల నుంచే పాదయాత్ర చేసే ఆలోచనపైనా చర్చిస్తున్నారని సమాచారం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్‌ రెడ్డి కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ ఊపందుకుంది. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ తరపున కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌ విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహించాలని రేవంత్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డిని కలిసినట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డికి చేవెళ్లలో కూడా మంచి ఫాలోయింగే ఉందని ఆయన వర్గం భావిస్తోంది. దీంతో రేవంత్‌ తన యాత్రకు చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను చేపట్టబోయే యాత్రకు మద్దతు తెలపాల్సిందిగా సబితా ఇంద్రారెడ్డిని రేవంత్‌ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ తన పాదయాత్రకు చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టి కాంగ్రెస్‌ను ఎలాగైతే అధికారంలోకి తెచ్చారో, రేవంత్‌ కూడా అదే విధంగా చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించి హస్తం పార్టీని అధికారంలోకి తెస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. రేవంత్‌తో పాటు విజయశాంతి కూడా కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరున వరంగ్‌లో రాహుల్‌ సభ ఉన్నందున అది అయ్యాకే రేవంత్తన రాజకయీ యాత్రపై నిర్ణయం తీసుకునే అవకాశాల ఉన్నాయి.